విహంగ స్త్రీవాద పత్రిక : స్త్రీ యాత్రీకులు

24/01/2011 19:48

ఈ పుస్తకం లో ఐరోపా , అమెరికా దేశాల వారి గురించి మాత్రమే రాయాల్సి వచ్చింది.ఇతర దేశాల్లో యాత్రలు చేసిన స్త్రీలు తక్కువ.

 ......'న స్త్రీ స్వాతతంత్ర్య  మర్హతి' అనే నిబంధన భారత దేశంలోని స్త్రీలకి మాత్రమే కాదు.అన్ని దేశాల్లోనూ  స్త్రీలకి విధించిన ఆంక్ష .
 
అమెరికా,ఐరోపా,ఏ దేశం వాళ్ళయినా 'తిరిగితే స్త్రీ చెడిపోతుంది' అనే భావాన్ని ప్రచారం  చేశారు.
 
తూర్పు దేశాల్లో స్త్రీల పాదాలు కట్టి  వేయడం ,పశ్చిమ దేశాల్లోని ఇనుప కచ్ఛడాలు  స్త్రీల స్వాతంత్ర్యాన్ని
 
అణచి వేసే ప్రయత్నం లో భాగాలే. గుర్రానికి కళ్ళెం వేసినట్టుగా స్త్రీల భావాలకి కూడా కళ్ళెం తయారు చేశారు. ....

ఆధునిక యుగం లో ప్రతి ఒక్కరూ తిరగక తప్పదు.జండర్  తేడా తగ్గిపోతూ వున్న రోజులివి.

అందుకే 'రాహుల్ సాంకృత్యాయన్' "తమ జన్మసాఫల్యం  చేసుకోవటానికీ ,

సమాజానికీ ,దేశానికీ కొంత మేలు చేయటానికీ .. స్త్రీలు తప్పని సరిగా లోక సంచార వ్రతాన్ని స్వీకరించాలి" అన్నాడు.

స్త్రీలు యాత్రలు చెయ్యాలి.యాత్రా సాహిత్యాన్ని  రాయటానికి ఉత్సాహం చూపాలి .

స్త్రీ యాత్రికులు అందరూ విజ్ఞానం కోసం ,ఆనందం కోసం,గ్లోబు మీద అక్షాంశాల్నీ  ,రేఖాంశాల్నీ  చెరిపేస్తారా అన్నంతగా తిరిగారు.
 
తెలుగులో యాత్రా సాహిత్యం చాల తక్కువ. 1860 వ  సం.ప్రాంతం లో శ్రీమతి పోతం జానకమ్మ 'ఇంగ్లాండ్ యాత్ర' ,

1920 సం. లో తాడూరి రామాబాయమ్మ' సిలోన్ యాత్ర ',

1967 లో నాయని కృష్ణ కుమారి ' కాశ్మీరు యాత్ర ',

ఇటీవల అబ్బూరి ఛాయా దేవి 'చైనా యాత్ర' చేసి  యాత్రా సాహిత్యాన్ని  రాశారు.

వీళ్ళంతా యాత్రీకులు కాక పోయినా  యాత్రలు చేయటం జరిగింది కాబట్టి ఆ వివరాలతో యాత్రా సాహిత్యాన్ని రాశారు.
   
 అలా చాలా మంది యాత్రలు చేసే వుంటారు.

 తెలుగు యాత్రా సాహిత్యాన్ని ఒక ఉజ్వల భవిష్యత్తు వైపుగా  ప్రయాణింప జేయటానికి ,

యాత్రా స్వాతంత్ర్యాన్ని అనుభవించటానికి స్త్రీలు ముందడుగు వేయాలి.*